: వైసీపీ నేతలు నా కులం గురించి మాట్లాడుతున్నారు: హీరో శివాజీ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ ఈరోజు విజయవాడ పున్నమి ఘాట్ వద్ద పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాకు అడ్డుపడుతున్న వారికి కూడా పిండాలు పెట్టినట్లు తెలిపారు. హోదా కోసం పోరాడుతోన్న తనపై పలువురు విమర్శలు చేస్తున్నారని, వైసీపీ నేతలు తన కులం గురించి మాట్లాడుతున్నారని శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ కులం కోసమో ఉద్యమం చేయడం లేదని, కేవలం ఏపీ ప్రజల ప్రయోజనాల కోసమే పోరాడుతున్నానని చెప్పారు. పాలక, ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా కోసం సరైన రీతిలో పోరాడడం లేదని శివాజీ అన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్యాకేజీలతో ఎటువంటి ప్రయోజనం లేదని ఆయన వ్యాఖ్యానించారు. 'ఏపీలో పుట్టాం.. ఏపీ రుణం తీర్చుకుంటాం' అని ఆయన అన్నారు. హోదా కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటోన్న నాయకులు నిజాయతీగా పోరాడడం లేదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యాకేజీలకు అంగీకరించొద్దని సూచించారు. పుష్కరాల ఏర్పాట్లు అన్నీ బాగున్నాయని శివాజీ కితాబిచ్చారు.