: బాలీవుడ్ లో హీరో, హీరోయిన్లను పరిచయం చేస్తే నిర్మాతకు ఆదాయమే ఆదాయం!

సినీ పరిశ్రమలో నూతన నటీనటులను పరిచయం చేసే నిర్మాతకు కాసుల వర్షం కురుస్తుందని బాలీవుడ్ కు చెందిన ఓ ట్రేడ్ అనలిస్ట్ సెలవిచ్చాడు. ఆయన వెల్లడించిన ఆసక్తికర విషయాల ప్రకారం...పేరున్న నిర్మాణ సంస్థలు స్టార్ లుగా పేరు తెచ్చుకున్న నటీనటులతో సినిమా తీయడం కంటే నూతన నటీనటులతో సినిమాలు నిర్మించేందుకు మొగ్గు చూపడం వెనుక కారణాన్ని ఆయన వెల్లడించారు. నూతన నటీనటులతో నిర్మించిన సినిమాలు హిట్టయ్యాయా? లేక ఫెయిలయ్యాయా? అన్నది పక్కన పెడితే, నూతన నటీనటులతో కుదుర్చుకునే ఒప్పందం ప్రకారం 5 సంవత్సరాల వరకు నిర్మాణ సంస్థకు రాబడి వస్తూనే ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ పద్ధతిని ప్రముఖ దర్శక, నిర్మాత ఆదిత్యా చోప్రా బాలీవుడ్ లో ప్రవేశపెట్టారట. దీంతో యశ్ రాజ్ ఫిల్మ్స్, ధర్మా ప్రొడక్షన్స్ నూతన తారలతో సినిమాలు నిర్మించేందుకు ఉత్సాహం చూపుతాయని ఆయన పేర్కొన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పధ్ధతి ప్రకారం సినీ పరిశ్రమకు పరిచయం చేయాలంటే... సినిమాల్లో వారు ప్రవేశించిన తరువాత ఐదేళ్ల వరకు వారి సంపాదనలో 20 శాతం సదరు నిర్మాణ సంస్థకు చెల్లిస్తూ ఉండాలని తెలుస్తోంది. ఈ నిబంధనను అగ్రిమెంట్ లో పేర్కొంటారని, ఈ 20 శాతం నిబంధన కేవలం సినిమాల విషయంలోనే కాకుండా ప్రకటనలు, లైవ్ షోలు, డ్యాన్స్ షోలు, ప్రత్యేక కార్యక్రమాలు... ఇలా అన్నిటి నుంచి వారి సంపాదనలో 20 శాతం నిర్మాతకు చెల్లించుకోవాలట. 2012లో బాలీవుడ్ కు యశ్ రాజ్ ఫిల్మ్స్ ద్వారా పరిచయం చేసిన అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ ల నుంచి భారీగా ఆదాయం సమకూరిందని ఆయన పేర్కొన్నారు. ఈ ముగ్గురూ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

More Telugu News