: సీన్ రివర్స్!... వైసీపీ వైపు టీడీపీ నేత చూపు!

అటు ఏపీలోనే కాకుండా ఇటు తెలంగాణలోనూ పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. అధికార పార్టీలోకి విపక్షాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు క్యూ కడుతున్నారు. అయితే ఏపీలో టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో సీన్ రివర్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ సీనియర్ నేత, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోవాలని ఆయన పక్కా ప్రణాళిక రచించుకుంటున్నట్లు తెలుస్తోంది. కొట్టు సత్యనారాయణ ఈ తరహా బాట పట్టడానికి కారణం లేకపోలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. 2014లోనే టీడీపీలో చేరిన ఆయన గడచిన ఎన్నికల్లో తాడేపల్లిగూడెం టికెట్టు ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి దక్కింది. దీంతో కొట్టు ఆశ నిరాశగా మారింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి కూడా పరిస్థితిలో మార్పేమీ కనిపించదని భావిస్తున్న కొట్టు సత్యనారాయణ పార్టీ మారాలని యోచిస్తున్నట్లు సమాచారం.

More Telugu News