: జైల్లోనే జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి.. జర్నలిస్టులవుతామంటున్న జంట
ఓ వ్యక్తిని చంపిన కేసులో కోర్టు వారిద్దరికీ జీవితఖైదు శిక్ష విధించింది. అయితే వారు జైల్లోనే జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి సత్ప్రవర్తనను కనబర్చారు. 14 ఏళ్ల నుంచి జైల్లోనే ఉన్న వారిని సత్ప్రవర్తన కారణంగా స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల చేశారు. పద్మావతి, సుభాష్ పాటిల్ అనే వ్యక్తుల కథ ఇది. జైలు నుంచి విడుదలైన సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ... తాము చేసిన తప్పుకు శిక్ష అనుభవించామని పేర్కొన్నారు. తాము జైల్లో పూర్తి చేసిన జర్నలిజం మాస్టర్ డిగ్రీతో మంచి జర్నలిస్టులుగా పనిచేసుకుంటామని చెప్పారు. తాము కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నామని తెలిపారు. వారు చేసిన నేరాన్ని పరిశీలిస్తే.. ఎక్సైజ్ కాంట్రాక్టర్గా బాధ్యతలు నిర్వర్తించే అశోక్ భార్య పద్మావతి. ఎంబీబీఎస్ చదువుతున్న సుభాష్ పాటిల్ అనే వ్యక్తితో పద్మావతికి వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం అశోక్ చెవిన పడడంతో ఆగ్రహానికి గురయి సుభాష్ని చంపుతానని అశోక్ అన్నాడు. అయితే, పద్మావతి, సుభాష్లు అశోక్నే హతమార్చాలని ప్లాన్ వేసుకున్నారు. 2002 జూన్ 15న పద్మావతి తన భర్త అశోక్ తో కలిసి బెంగళూరులోని తన పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే సుభాష్ ని కూడా అక్కడికి రప్పించింది. పద్మావతి సాయంతో అశోక్ను సుభాష్ నాటు తుపాకీతో కాల్చి హతమార్చాడు. ఘటన పట్ల కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా పద్మావతి, సుభాష్లే అశోక్ను హతమార్చారని తేల్చారు. దీంతో కోర్టు వారికి జీవితఖైదు విధించింది. జైల్లోనే జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఇప్పుడు జర్నలిస్టులమవుతామని అంటున్నారు.