: బిర్యానీ, రోటీ పెడతారని ఆశగా వెళితే టీ, బిస్కెట్ ఇచ్చి పంపిన బ్రెజిల్ భారత రాయబార కార్యాలయం!

అసలే ఇష్టమైన ఆహారానికి రోజుల తరబడి దూరంగా ఉన్న ఒలింపిక్స్ అథ్లెట్లు... బ్రెజిల్ రాయబార కార్యాలయం నుంచి విందుకు పిలుపు రాగానే, తమకు నచ్చిన ఆహారం తినవచ్చని ఆశగా వెళ్లి నిరాశతో వెనుదిరిగి వచ్చారు. భారత స్వాతంత్ర్యదిన వేడుకల వేళ, ఆటగాళ్లందరికీ విందును ఇవ్వాలని భావించిన భారత యువజన, క్రీడా శాఖ, బ్రెజిల్ ఎంబసీ అందరినీ ఆహ్వానించాయి. దీనికి వెళ్లిన వారంతా తీవ్ర అసంతృప్తితో వెనుదిరిగి రావాల్సి వచ్చింది. చాలా రోజులుగా నాలుకకు సరైన రుచి అందక ఇబ్బంది పడుతున్న ఆటగాళ్లు ఈ కార్యక్రమానికి రాగా, వారికి టీ, కాఫీ, వేరుశనగ పప్పు, బిస్కెట్లు ఇచ్చి పంపారు. మంచి విందు ఇస్తారని, తమకు దూరమైన ఇంటి ఆహారాన్ని లాగించవచ్చని ఆశగా వస్తే, ఇలా చేశారని, టీ తాగి బిస్కెట్ తినేందుకు అథ్లెటిక్ గ్రామం నుంచి ఇక్కడి దాకా రావడం ఎందుకని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆటగాడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇక్కడికి వచ్చి వెళ్లడానికి నాలుగు గంటలు పట్టిందని అన్నాడు. "ఆటగాళ్లకు కొంత ఆహారాన్ని సిద్ధం చేయించి ఉండాల్సింది. వారెంతో ఆకలితో, ఆశతో వచ్చారు. కనీసం మంచి స్నాక్స్ కూడా పెట్టలేదు" అని భారత జట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ పవన్ దీప్ సింగ్ కోహ్లీ వ్యాఖ్యానించారు.

More Telugu News