: ‘ఎట్ హోం’కు దూరంగా చంద్రబాబు!... గవర్నర్ తేనీటి విందుకు హాజరుకానున్న కేసీఆర్!

భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ ‘ఎట్ హోం’ పేరిట ఇచ్చే తేనీటి విందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు సహా అధికారులు అంతా హాజరవుతారు. ఈ క్రమంలో నేడు హైదరాబాదులోని రాజ్ భవన్ లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా ‘ఎట్ హోం’ విందు ఇస్తున్నారు. రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా ఉన్న నరసింహన్... ఎట్ హోంకు ఇద్దరు సీఎంలు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులకు ఆహ్వానం పంపారు. ఈ ఆహ్వానాన్ని మన్నించిన కేసీఆర్ నేటి సాయంత్రం రాజ్ భవన్ లో జరిగే ‘ఎట్ హోం’ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే నవ్యాంధ్రకు రాజధాని అంటూ లేని పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్వాతంత్య్ర వేడుకల కోసం అనంతపురం వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆయన ‘ఎట్ హోం’కు హాజరయ్యే అవకాశాలు లేనట్లే. ఈ వాదనకు బలం చేకూరుస్తున్నట్లు నేటి చంద్రబాబు షెడ్యూల్ లో ‘ఎట్ హోం’ కార్యక్రమం ఇప్పటిదాకా కనిపించలేదు.

More Telugu News