: చాలా గర్వంగా ఉందంటున్న విరాట్ కోహ్లీ!

వెస్టిండీస్ గడ్డపై ఆరేళ్ల అనంతరం టెస్టు సిరీస్ ను గెలుచుకున్న విరాట్ కోహ్లీ సేన ఆనందానికి ఇప్పుడు అవధుల్లేవు. గతంలో వెస్టిండీస్ లో పర్యటనలు జరిపిన భారత జట్టు విజయాలు సాధించి, సిరీస్ లను కొల్లగొట్టగా, ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, హ్యాట్రిక్ సిరీస్ విజయం సాధించిన భారత జట్టు కెప్టెన్ కోహ్లీ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 2006, 2010లో కరేబియన్లను ఓడించిన భారత జట్టు, ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టగా, శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్ లపై వరుస విజయాలతో కోహ్లీ సేన మరో హ్యాట్రిక్ కొట్టింది. ఇక ఆటగాళ్లతో బస్సులో ప్రయాణిస్తున్న వేళ, తీసుకున్న ఫోటోను కోహ్లీ సామాజిక మాధ్యమాల్లో పెడుతూ, ఈ సందర్భంగా తనకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఈ విజయంతో తన ఆనందానికి హద్దులు లేవని, గర్వపడుతున్నామని చెప్పుకొచ్చాడు. కాగా, నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో భారత జట్టు సిరీస్ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News