: ఇండియాలో అబ్బాయిల కన్నా వేగంగా పొడవు పెరుగుతున్న అమ్మాయిలు!

1914 నుంచి 2014 మధ్య భారత్ లో యువకుల సగటు పొడవు 3 సెంటీమీటర్లు పెరుగగా, యువతుల పొడవు 5 సెంటీమీటర్లు పెరిగింది. లండన్ ఇంపీరియల్ కాలేజీకి చెందిన 800 మంది రీసెర్చర్లు ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో 1.86 కోట్ల మందిని భాగస్వామ్యం చేస్తూ, అధ్యయనం చేయగా పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియాలో తల్లిదండ్రుల కన్నా, వారి పిల్లలు అధికంగా ఎత్తును పెరుగుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. యువకుల సరాసరి ఎత్తు 3 సెం.మీ పెరిగి 165 సెం.మీ (5.5 అడుగులు)లకు చేరగా, యువతులు 5 సెం.మీ పెరిగి 153 సెం.మీ (5.1 అడుగులు)లకు చేరిందని స్టడీ వెల్లడించింది. ఇక ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎత్తు పెరిగే పురుషులున్న దేశంగా నెదర్లాండ్స్ ఉండగా, లాత్వియన్ మహిళలు పొడగరులుగా నిలిచారు. గడచిన శతాబ్దం వ్యవధిలో చాలా దేశాల్లో ప్రజల ఎత్తు పెరిగిందని, ఇరాన్ పురుషులు సరాసరిన అత్యధికంగా 16.5 సెం.మీ ఎత్తు పెరుగగా, సౌత్ కొరియా మహిళలు 20.2 సెం.మీ ఎత్తు పెరిగారని ఇంపీరియల్ కాలేజ్ ప్రొఫెసర్ జేమ్స్ బెన్ థామ్ వెల్లడించారు. ఒకప్పుడు అత్యంత పొడగరులు అత్యధికంగా ఉన్న అమెరికా (1914లో నాలుగో స్థానం) ఈ తాజా అధ్యయనం తరువాత పురుషుల విషయంలో 42వ స్థానంలో, మహిళల విషయంలో 37వ స్థానంలో నిలిచిందని తెలిపారు. సమతుల ఆహారం, శుద్ధి చేసిన మంచినీరు, చిన్నారుల్లో ఇన్ఫెక్షన్ల ప్రభావం తగ్గడం వంటి కారణాలతో ఎత్తు పెరుగుతున్నారని ఆయన వెల్లడించారు.

More Telugu News