: 'ఎర్రకోట వరకూ ఎందుకు? ఇప్పుడే మాట్లాడుతా...!': సచిన్ సలహాపై వెంటనే స్పందించిన మోదీ

ఎర్రకోటపై భరతజాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించే వేళ, రియో అథ్లెట్లకు మానసిక స్థైర్యాన్ని కలిగించే మాటలు చెప్పాలన్న సచిన్ సలహాపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. "భారత క్రీడాకారుల్లో అత్యంత అభిమానాన్ని సంపాదించుకున్న భారతరత్న సచిన్ రమేశ్ టెండూల్కర్, అథ్లెట్ల గురించి ఆగస్టు 15 ప్రసంగంలో మాట్లాడాలని సూచించారు. ఆయన ఆలోచనను అభినందిస్తున్నా. ఈ విషయం మాట్లాడేందుకు ఆగస్టు 15 వరకూ ఆగడం ఎందుకు? ఇప్పుడే మాట్లాడుతా" అని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెట్టారు. "రియో ఒలింపిక్స్ లో మన ఆటగాళ్లుండటం ఎంతో గర్వకారణం. వారెంతో శ్రమిస్తున్నారు. విజయం, పరాజయం జీవితంలో ఓ భాగం. మిగిలిన అన్ని ఆటల్లో పోటీ పడుతున్న వారు తమ అత్యుత్తమ ఆట తీరును కనబరచాలి. ఫలితం గురించిన బెంగ వద్దు. ఓర్పు, సంకల్పం, అంకితభావంతో ప్రతి భారత అథ్లెట్ ముందుకు సాగాలి. ఆటగాళ్లంతా భారత్ కు గర్వకారణం. వారు జాతి యావత్తూ గర్వపడేలా చేయాలి" అని మోదీ ట్వీట్లు పెట్టారు.

More Telugu News