: సెలవుల ఎఫెక్ట్... కదిలిన జనసంద్రం... కిక్కిరిసిపోయిన పుష్కర ఘాట్లు

కృష్ణానది పుష్కరాలకు ముచ్చటైన మూడవ రోజున జనసంద్రం కదిలింది. ఈ తెల్లవారుఝాము నుంచే తెలుగు రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. తెలంగాణలోని బీచుపల్లి, గొందిమళ్ల, రంగాపురం, మట్టపల్లి, వాడపల్లి, నాగార్జున సాగర్ లతో పాటు, ఏపీలోని శ్రీశైలం, సాగర్, సత్రశాల, దైద, అమరావతి, సీతానగరం, విజయవాడ, హంసలదీవి ఘాట్లకు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ఘాట్లన్నీ భక్తజనులతో కళకళలాడుతున్నాయి. వరుస సెలవుల కారణంగా రద్దీ అధికంగా కనిపిస్తోందని, నేడు, రేపు ఇదే రద్దీ ఉంటుందని అధికారులు అంటున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రద్దీ ఎక్కువగా ఉన్న ఘాట్ల వద్దకు భక్తులను వెళ్లనీయకుండా చూసి, తక్కువ రద్దీ ఉన్న ఘాట్లకు వారిని తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశామని, విజయవాడలో అధికారులు వివరించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ఘాట్లలో నీరు పరిశుభ్రంగా ఉందన్న వార్తలతో అక్కడికి వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. పుష్కరాల రెండో రోజు ముగిసేసరికి తెలంగాణలో 10.55 లక్షల మంది, ఏపీలో 15 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్టు సమాచారం.

More Telugu News