: అవయవ దానం... కొన్ని వాస్తవాలు!

మన దేశంలో ఈరోజు అవయవ దాన (ఆర్గాన్ డొనేషన్) దినోత్సవం జరుపుకుంటున్నాం. అవయవ దానం చేయడం వల్ల మరొక వ్యక్తికి రెండో జన్మనిచ్చినట్లే అవుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, కేవలం 0.08 శాతం మంది భారతీయులు మాత్రమే తమ అవయవాలను దానం చేస్తున్నారట. అదే, స్పానియార్డులు, బెల్జియన్ల విషయానికొస్తే 70-80 శాతం మంది ఆర్గాన్ డొనేషన్ చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఏడాది భారత్ లో 2 లక్షల మందికి కొత్త కిడ్నీలు, లక్ష మందికి లివర్లు అవసరమని పేర్కొన్నారు. దీనికి తగ్గట్లుగా ఇండియన్స్ ఆర్గాన్ డొనేషన్ జరగడం లేదన్నారు. దాని గురించి అవగాహన లేకపోవడం, అమాయకత్వం, మూఢ నమ్మకాలు తదితర కారణాలున్నాయన్నారు. ప్రజలను చైతన్య పరచడం, మీడియా ద్వారా ప్రచారం చేయడం వంటి వాటితో ప్రజలను అవయవ దానం వైపు మళ్లించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు ఆర్గాన్ డొనేషన్ సందర్భంగా ఇందుకు సంబంధించి తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తవాలు ... * ఒక వ్యక్తి తన అవయవాలను దానం చేయడం ద్వారా సుమారు 50 మందికి కొత్త జీవితం ప్రసాదించవచ్చు * మానవ శరీరంలో దరిదాపు ప్రతి ముఖ్యమైన భాగాలను దానం చేయవచ్చు. గుండె, కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులు, పాంక్రియాస్, బ్లడ్, బ్లడ్ వెసల్స్ (రక్తనాళాలు) మొదలైనవి * అవయవ దానానికి సంబంధించి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. కొత్తగా జన్మించిన శిశువు నుంచి 75 సంవత్సరాల వారి వరకు అర్హులే. * అవయవ దానమనేది మూడు రకాలు...లివింగ్ డొనేషన్, డిసీజ్డ్ డొనేషన్, వాస్కుల్యర్ కంపోజిట్ అలోగ్రాఫ్ట్స్(వీసీఏ). * ఎవరైనా అవయవ దానం చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది, వైద్యుల అనుమతి. ఆయా అవయవాలను వైద్యులు పరీక్షించి బాగున్నాయని నిర్ధారించుకోవడంతో పాటు సదరు రోగికి ఆ అవయవాలు సరిపోతాయనుకున్నప్పుడే వాటిని అమరుస్తారు. * అవయవ దానం చేయదలచుకున్న వారి కోసం ప్రతి రాష్ట్రంలోని సంబంధిత విభాగాల్లో తమ పేర్లు రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది.

More Telugu News