: కొనుగోళ్లు వెల్లువెత్తిన వేళ... భారీ లాభాల్లో మార్కెట్

క్రితం ముగింపుతో పోలిస్తే సెషన్ ఆరంభంలోనే 100 పాయింట్లకు పైగా లాభంలో ఉన్న సెన్సెక్స్, ఆపై వచ్చిన కొనుగోలు మద్దతుతో భారీ లాభాల దిశగా దూసుకెళ్లింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత కంపెనీల ఈక్విటీలను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. బెంచ్ మార్క్ ఇండెక్స్ తో పోటీపడి మిడ్ క్యాప్ దూసుకు పోగా, చిన్న సంస్థలు మాత్రం కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 62 వేల కోట్లకు పైగా పెరిగింది. శుక్రవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 292.80 పాయింట్లు పెరిగి 1.05 శాతం లాభంతో 28,152.40 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 80 పాయింట్లు పెరిగి 0.93 శాతం లాభంతో 8,672.15 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.83 శాతం, స్మాల్ కాప్ 0.21 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 33 కంపెనీలు లాభపడ్డాయి. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంక్, హిందాల్కో, టాటా మోటార్స్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, సిప్లా, ఐడియా, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,838 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,264 కంపెనీలు లాభాలను, 1,392 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. గురువారం నాడు రూ. 1,08,13,028 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 1,08,75,239 కోట్లుగా నమోదైంది.

More Telugu News