: ఫుల్లుగా పార్టీ ఇచ్చింది... ఇక తనువు చాలించింది!

కొన్ని నిర్ణయాలు మనసు లోతుల్లో బలంగా ముద్రపడిపోతాయి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రంగస్థల నటి, చిత్రకారిణి బెస్టీ డెవిస్ (41) అనే మహిళ తీసుకున్న నిర్ణయం కూడా ఆమె 30 మంది స్నేహితుల్లో అలాంటి ముద్రను వేసింది. వివరాల్లోకి వెళ్తే...బెస్టీ డెవిస్ తనకు అత్యంత ఆప్తులైన 30 మంది స్నేహితులకు జూలై 23-24 తేదీల్లో తానిచ్చే విందుకు హాజరు కావాలని ఈ మెయిల్ పంపింది. ఈ రెండు రోజుల విందు మీరు గతంలో వెళ్లిన పార్టీల మాదిరిగా ఉండకపోవచ్చని, భావోద్వేగ స్థిరత్వం, దృఢత్వం, విశాల మనస్తత్వం ఉన్నవాళ్లు మాత్రమే హాజరుకావాలని ఆమె స్పష్టం చేసింది. 'మనసులోని మాటలు పంచుకోవడం, డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం, ప్రార్థనలు చేయడం, ఇష్టమైన ఆహారపదార్థాలు, ఆల్కహాల్ నచ్చినంత పుచ్చుకుని హాయిగా గడపాలి, ఎవరూ ఏడవకూడదు' అని ఆమె షరతు విధించింది. ఏడ్చే ఆలోచన ఉంటే ఈ విందుకు హాజరుకావద్దంటూ బెస్టీ తన ఈమెయిల్ లో స్పష్టం చేసింది. దీంతో ఆమె స్నేహితులు ఆమె కోరిక తీర్చారు. రెండు రోజులు పార్టీతో హాయిగా గడిపింది. ఈ ఆనందం ఇక చాలని భావించింది. అంతే, విందు తరువాత ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవడం ద్వారా నిద్దర్లోనే శాశ్వతంగా కన్నుమూసింది. కాగా, అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం "తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఆరు నెలలకుమించి బతికే అవకాశం లేనివారు యుక్తవయస్కులై ఉంటే వైద్యుల పర్యవేక్షణలో ఆత్మహత్య చేసుకోవచ్చ"నే కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం రెండు నెలల క్రితం అమలులోకి వచ్చింది. దీంతో ఈ చట్టం అమలైన తరువాత ఆత్మహత్య చేసుకున్న తొలి మహిళగా బెస్టీ నిలిచింది. దీనిపై ఆమె స్నేహితుడైన సినిమాటోగ్రాఫర్ నీల్స్ అల్పెర్ట్ మాట్లాడుతూ, 'స్నేహితులతో ఓ అందమైన వీకెండ్ ను గడిపి.. ఆ తర్వాత సూసైడ్ చేసుకోవాలనుకోవడం మామూలు ఆలోచన కాదు. ఇది సాధారణంగా ప్రతిసారి ఎదురయ్యే అనుభవం కాదు. తన ముందు మేము ఆనందంగా నవ్వుతూ గడిపినప్పటికీ.. తర్వాత ఏం జరుగుతుందన్నది మా మనస్సులో మెదులుతూనే ఉంది. ఇలాంటి పార్టీకి వెళ్లడం నిజంగా ఒక చాలెంజింగ్ అంశం' అని అన్నారు.

More Telugu News