: 'ఉపాసన' పూర్తి... ఇక పంజాబ్, గుజరాత్ లే కేజ్రీవాల్ లక్ష్యం!

ఆధ్యాత్మిక కేంద్రం ధర్మశాలలో 10 రోజుల పాటు ప్రత్యేక 'ఉపాసన' తరగతుల్లో పాల్గొని ధ్యానంపై శిక్షణ తీసుకుని ఢిల్లీకి చేరుకున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్, త్వరలో జరగనున్న పంజాబ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టిని సారించాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికలకు సాధ్యమైనంత ముందుగానే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించాలన్నది కేజ్రీవాల్ ఆలోచనగా తెలుస్తోంది. పంజాబ్ పై గట్టి ఆశలు పెంచుకున్న ఆమ్ ఆద్మీ, ఇప్పటికే మంచి ప్రజా మద్దతును కూడా పొందినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేజ్రీవాల్ దృష్టి ప్రధానంగా పంజాబ్ పైనే ఉంటుందని అంచనా. గోవా బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ లకు అప్పగించాలని అనుకుంటున్న కేజ్రీవాల్, గుజరాత్ బాధ్యతలను మంత్రి కపిల్ మిశ్రా, మాజీ ఎడిటర్ అశుతోష్ భుజాలపై పెడతారని తెలుస్తోంది. నెలలో రెండు వారాల పాటు ఢిల్లీలో, మిగిలిన రెండు వారాలను రాష్ట్రాల్లో పర్యటించేందుకు కేజ్రీవాల్ కేటాయించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

More Telugu News