: టీఆర్ఎస్ ఎమ్మెల్యే భవనం కూల్చివేతకు జీహెచ్ఎంసీ సిద్ధం!... ‘చింతల్’ నారాయణ స్కూల్ వద్ద హైటెన్షన్!

టీఆర్ఎస్ కు చెందిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కు చెందిన రెండు భవనాలను కూల్చివేసేందుకు గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు సిద్ధమయ్యారు. చింతల్ లోని ఈ రెండు భవనాల్లో ప్రస్తుతం నారాయణ విద్యా సంస్థలకు చెందిన కాలేజీ, పాఠశాల కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండానే ఈ భవనాలను వివేకానంద నిర్మించారని ఇటీవలే నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివేకానంద నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ భవనాలను కూల్చివేసేందుకు కొద్దిసేపటి క్రితం జీహెచ్ఎంసీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు అక్కడకు చేరుకుని అధికారుల తీరుకు నిరసనగా ధర్నాకు దిగారు. మరోవైపు తాము తరగతులు నిర్వహిస్తున్న భవనాలకు అనుమతులు లేవని తెలుసుకున్న తర్వాత కూడా నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేదు. వెరసి సదరు భవనంలోని విద్యాలయాల్లో చదువుతున్న నారాయణ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జీహెచ్ఎంసీ అధికారుల కూల్చివేత యత్నాలు, ఎమ్మెల్యే అనుచరుల ఆందోళనలతో అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

More Telugu News