: వందేళ్లుగా అలుపెరగని ‘మార్పిడి’ మూత్రపిండం!... బ్రిటన్ లో వెలుగుచూసిన అద్భుతం!

శరీరంలోని ఏదో ఒక అవయవం పనిచేయని కారణంగా ఆయా వ్యక్తులు తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. ఇలాంటి వారికి అవయవ మార్పిడే శరణ్యమని వైద్యులు చెబుతున్నారు. తమ ఆప్తులను బతికించుకోవడానికి శరీరంలోని అవయవాలను దానం చేస్తున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో బ్రిటన్ లో ఓ అద్భుత ఘటన వెలుగుచూసింది. ఒక వ్యక్తి శరీరం నుంచి తీసిన మూత్రపిండం మరో వ్యక్తికి అమర్చారు. ఆ తర్వాత ఆ మూత్రపిండం అలుపెరగకుండా పనిచేస్తూనే ఉంది. వెరసి ఆ మూత్రపిండం వందేళ్లకు పైగా ఎలాంటి అలుపు సొలుపు లేకుండానే పనిచేయడం వైద్య వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వివరాల్లోకెళితే... బ్రిటన్ కు చెందిన సూ వెస్టెడ్ అనే మహిళ 1973లో ఓ కిడ్నీ చెడిపోయిన కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. కిడ్నీ మార్పిడి మాత్రమే ఆమెను బతికిస్తుందని వైద్యులు తేల్చారు. నవ మాసాలు మోసి కని పెంచుకుంటున్న కూతురును బతికించుకునేందుకు వెస్టెడ్ మాతృమూర్తి యాన్ మెట్ కాఫే ముందుకొచ్చింది. అప్పటికి వెస్టెడ్ వయసు 25 ఏళ్లు ఉండగా, మెట్ కాఫే వయసు 57 ఏళ్లు. వృద్ధాప్యం సమీపిస్తున్న సమయంలో మెట్ కాఫే... కూతురు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మూత్రపిండాన్ని దానమిచ్చింది. ఇరువురికి ఆపరేషన్ చేసిన వైద్యులు మూత్రపిండం మార్పిడిని విజయవంతంగా ముగించారు. సాదారణంగా మార్పిడి చేసిన మూత్రపిండం 20 ఏళ్ల కంటే అధిక కాలం పనిచేసే పరిస్థితులు లేవు. అయితే సదరు కిడ్నీ మార్పిడి జరిగి 43 ఏళ్లు అవుతున్నా వెస్టెడ్ శరీరంలోని ఆమె తల్లి మూత్రపిండం భేషుగ్గా పనిచేస్తోంది. ఈ విధనగా ఆ మూత్రపిండం వయసు ఏకంగా వందేళ్లకు చేరింది. దీనిపై స్పందించిన వైద్యులు ఇదో అద్భుతమేనని ప్రకటించారు. తన తల్లి జన్యువుల కారణంగానే ఇప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవిస్తున్నానని ప్రస్తుతం 68 ఏళ్ల వయసులో ఉన్న వెస్టెడ్ చెబుతున్నారు.

More Telugu News