: పుష్కరాల్లో తప్పిపోయిన పిల్లలను పట్టిచ్చే ‘కృష్ణమ్మ’!... యాప్ ను విడుదల చేసిన నారా లోకేశ్!

రేపటి నుంచి కృష్ణా పుష్కరాలు మొదలుకానున్నాయి. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో పుణ్య స్నానాల కోసం ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు భారీ ఏర్పాట్లు చేశాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న పుష్కరాలకు రెండు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కర ఘాట్లకు తరలిరానున్నారు. ఈ క్రమంలో రద్దీలో పిల్లలెవరైనా తల్లిదండ్రుల చేయి విడిచి తప్పిపోతే ఎలా? ఇలాంటి ఘటనలు ఆయా కుటుంబాలను తీవ్ర మనోవేదనకు గురిచేస్తాయి. అయితే పవిత్ర పుష్కరాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు టీడీపీ విద్యార్థి విభాగం తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) ఓ యాప్ ను రూపొందించింది. ‘కృష్ణమ్మ’ పేరిట రూపొందించిన ఈ యాప్ ను నిన్న గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవిష్కరించారు. పుష్కరాల్లో తప్పిపోయే పిల్లలను తిరిగి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చే ఈ యాప్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. అన్ని పుష్కర ఘాట్లలో టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు వలంటీర్లుగా పనిచేస్తారని కూడా ఆయన ప్రకటించారు.

More Telugu News