: ఆకతాయిలపై ఆపరేషన్ చబుత్రా.. ప‌ట్టుబ‌డ్డ 221 మంది పాతబస్తీ యువ‌కులకు పోలీసుల కౌన్సెలింగ్

హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి పోలీసులు చేసిన త‌నిఖీల్లో ప‌ట్టుబ‌డ్డ‌వారికి ఈరోజు కౌన్సెలింగ్ ఇచ్చారు. రోడ్లపై హల్చల్ చేస్తున్న యువతే లక్ష్యంగా 'ఆపరేషన్ చబుత్రా' పేరుతో పోలీసులు ఇటీవ‌ల చేసిన ముమ్మర త‌నిఖీల్లో మొత్తం 221 మంది యువ‌కులు ప‌ట్టుబ‌డ్డ సంగ‌తి తెలిసిందే. వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేష‌న్‌కి త‌ర‌లించిన పోలీసులు ఈరోజు వారి త‌ల్లిదండ్రుల స‌మ‌క్షంలో పురానీ హవేలిలోని సౌత్ జోన్ డీసీపీ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. యువ‌త అర్ధ‌రాత్రి రోడ్ల‌పై తిరుగుతూ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. మ‌రోసారి ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే తీవ్ర‌ప‌రిణామాలు ఎదుర్కుంటార‌ని పోలీసులు హెచ్చ‌రించారు. తాము చేస్తున్న హ‌ల్‌చ‌ల్ ప‌ట్ల యువకులతోనే పోలీసులు మాట్లాడించారు. త‌ల్లిదండ్రుల‌తో వారికి బుద్ధి చెప్పించారు. చర్యలకు పాల్పడితే ఎటువంటి ప‌ర్య‌వ‌సానాలు ఉంటాయో ప‌ట్టుబ‌డ్డ యువ‌త‌కు వివ‌రించామ‌ని పోలీసులు చెప్పారు. పిల్లల పట్ల త‌ల్లిదండ్రులు తీసుకోవాల్సిన‌ బాధ్య‌తను కూడా కౌన్సెలింగ్‌లో వివ‌రించి చెప్పామ‌ని పోలీసులు మీడియాకు తెలిపారు. త‌మ పిల్ల‌లు ఎవ‌రిపైనైనా అఘాయిత్యానికి పాల్ప‌డితే ఆ బాధ్యత ఎవ‌రిది? అని త‌ల్లిదండ్రుల‌ను ప్ర‌శ్నించిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోసారి ఇటువంటి చర్యలకు పాల్పడమని, తమకు బుద్ధి వచ్చిందని యువకులు చెప్పారు. తమ పిల్లలను ఇకపై అదుపులో పెడతామని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

More Telugu News