: రేపు లోక్‌సభకు జీఎస్‌టీ బిల్లు... పూర్తి మద్దతు ఇస్తామంటున్న కాంగ్రెస్

అన్ని అడ్డంకులు తొల‌గించుకొని రాజ్య‌స‌భ‌లో ఆమోదం పొందిన వస్తు సేవలపన్ను(జీఎస్‌టీ) బిల్లు రేపు లోక్‌సభకు రానుంది. కాంగ్రెస్ నుంచి కూడా సానుకూల స్పంద‌న వ‌స్తుండ‌డంతో వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ బిల్లును అమల్లోకి తీసుకురావాల‌ని కేంద్రం భావిస్తోంది. రేపు లోక్‌స‌భ‌లో బిల్లుకి అన్ని రాజకీయ పార్టీల నుంచి సానుకూల స్పంద‌నే వ‌స్తుంద‌ని కేంద్రం భావిస్తోంది. స‌భ‌లో జీఎస్‌టీపై చ‌ర్చ కూడా ఎటువంటి గంద‌ర‌గోళం లేకుండా సాఫీగా సాగిపోతుంద‌ని యోచిస్తోంది. జీఎస్‌టీ బిల్లు గత ఏడాదే లోక్‌సభలో ఆమోదం పొందిన విష‌యం తెలిసిందే. అయితే రాజ్యసభలో బిల్లుపై చ‌ర్చ అనంత‌రం బిల్లుకి ప‌లు సవరణలు చేశారు. దీంతో మ‌ళ్లీ బిల్లు లోక్‌స‌భ‌ ఆమోదం పొందాల్సి వుంది. దీనిపై రేపు లోక్ సభలో స‌భ‌లో మోదీ ప్ర‌సంగం కూడా ఉంటుంద‌ని స‌మాచారం. లోక్‌స‌భ‌లో కాంగ్రెస్ నుంచి జీఎస్‌టీ బిల్లుకు పూర్తి మద్దతు ఉంటుంద‌ని ఆ పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు మీడియాకు తెలిపారు. త‌మ పార్టీ ఇప్ప‌టికే ఎంపీల‌కు విప్ జారీ చేసింద‌ని అన్నారు.

More Telugu News