: ఇప్పుడు గోవా వంతు.. రక్షణ మంత్రి పారికర్‌ను సీఎంగా పంపే ఆలోచనలో బీజేపీ అధిష్ఠానం?

రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లనున్నారా..? బీజేపీ తీరు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. గుజరాత్‌లో పరిస్థితులు చక్కబడడంతో ఇప్పుడు అధిష్ఠానం గోవాపై దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రకంపనలతో ముఖ్యమంత్రిని మార్చేసిన బీజేపీకి గోవాలోనూ అదే పార్టీ కొరకరాని కొయ్యగా మారినట్టు తెలుస్తోంది. దీంతో సీఎం మార్పే అందుకు పరిష్కారంగా అధిష్ఠానం తేల్చినట్టు సమాచారం. రాజకీయ విశ్లేషకుల అంచనాలు నిజమైతే త్వరలో గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ తన పదవికి రాజీనామా సమర్పిస్తారు. ఆ స్థానంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బీజేపీ రాష్ట్రంలో తీవ్ర కష్టాల్లో ఉన్నట్టు భావించాల్సి వస్తోందని విశ్లేషకులు అంటున్నారు. గోవా ప్రభుత్వం పనితీరుపై దృష్టి సారించిన ప్రధాని మోదీ ప్రభుత్వం నుంచి నివేదిక కోరినట్టు తెలిసింది. దీనికి తోడు గోవాలో బీజేపీ, ఆరెస్సెస్ మధ్య విభేదాలు కూడా సీఎం మార్పును అనివార్యం చేసినట్టు సమాచారం.

More Telugu News