: బులంద్‌షహర్ గ్యాంగ్ రేప్ బాధితులు కోరితే సీబీఐ దర్యాప్తుకు ఓకే: సీఎం అఖిలేష్

బులంద్‌షహర్ గ్యాంగ్ రేప్ బాధితులు కోరితే సీబీఐ దర్యాప్తునకు తాము సిద్ధమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రేప్ కేసు ఘటనలో యూపీ ప్రభుత్వ తీరుపై దేశవ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇంటా బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం అఖిలేష్ మాట్లాడుతూ బాధితులు కనుక కోరుకుంటే ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. బులంద్‌షహర్ ఘటన దురదృష్టకరమని పేర్కొన్న అఖిలేష్ దోషులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. దోషులపై చర్యల విషయంలో అధికారులు గట్టి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఓ బృందాన్ని ఘటన జరిగిన ప్రాంతంలో మోహరించినట్టు పేర్కొన్నారు. ‘‘బాధిత కుటుంబ సభ్యులు కోరుకుంటే సీబీఐతో విచారణకు సిద్ధం’’ అని సీఎం స్పష్టం చేశారు. ఈ కేసును నీరు గార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, వెంటనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని బీజేపీ జాతీయ సెక్రటరీ శ్రీకాంత్ శర్మ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన అఖిలేష్ తాము సీబీఐ దర్యాప్తునకు సిద్ధమేనని, బాధితులు కోరితే వెంటనే ఆ పనిచేస్తామంటూ దీటుగా బదులిచ్చారు.

More Telugu News