: ఐసీసీ ప్రతిపాదనను వ్యతిరేకించిన బీసీసీఐ

ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న బీసీసీఐ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఐసీసీ ప్రతిపాదించనున్న టూ టైర్ టెస్ట్ సిస్టమ్ ను వ్యతిరేకిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. టూ టైర్ సిస్టమ్ వల్ల క్రికెట్ ఆడే చిన్నదేశాలకు నష్టం వాటిల్లుతుందని, క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేయాలంటే అలాంటి దేశాల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. టూ టైర్ సిస్టమ్ వల్ల చిన్నదేశాల జట్లు పెద్ద దేశాలతో ఆడే అవకాశంతో పాటు రెవెన్యూను కూడా కోల్పోతాయని ఆయన తెలిపారు. కాగా, టెస్టు క్రికెట్ ను టూ టైర్స్ (శ్రేణులు) గా విభజించాలని ఐసీసీ ప్రతిపాదించింది. దీనిప్రకారం మొదటి గ్రూప్ లో ఏడు అగ్ర దేశాలు, రెండో గ్రూపులో ఐదు దిగువ శ్రేణి దేశాలు, రెండు కొత్త టెస్టు హోదా దేశాలను చేర్చాలి. వీటి మధ్య వన్డే, టీ20 ప్రపంచ కప్ తరహాలో టెస్టు చాంపియన్ షిప్ నిర్వహించాలని ఐసీసీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులు సమర్థించగా, బీసీసీఐ వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. బీసీసీఐ మాత్రం ప్రపంచ క్రికెట్ ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యమని చెబుతోంది.

More Telugu News