: బెంగళూరులో దారుణం!... మదరసాకు వెళ్లలేదని ముగ్గురు చిన్నారుల కాళ్లకు సంకెళ్లు!

భారత్ లో సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. మదరసాకు వెళ్లేందుకు నిరాకరించిన ముగ్గురు చిన్నారి బాలుర కాళ్లకు సంకెళ్లు పడ్డాయి. వివరాల్లోకెళితే... నగరంలోని హెచ్ఎస్ఆర్ లే అవుట్ కు చెందిన సిరాజ్ వహాబ్ కు ముగ్గురు కుమారులు. వారంతా 7 నుంచి పదేళ్ల వయసులోపు వారే. వారిపై గంపెడాశలు పెట్టుకున్న సిరాజ్... మదరసాలో చదువుకోమని వారిని పురమాయించాడు. అయితే మదరసాలో చదువుకునేందుకు ఆ ముగ్గురు బాలురు నిరాకరించారట. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిరాజ్ అక్కడికి సమీపంలోని మదరసాకు చెందిన మౌలానాతో ఈ విషయం చెప్పాడు. పిల్లలకు బుద్ధి చెప్పి మదరసాలో చదువుకునేలా చేయాలని సిరాజ్... మౌలానాను ప్రాధేయపడ్డాడు. సిరాజ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మౌలానా ఆ ముగ్గురు పిల్లల కాళ్లకు ఒకే గొలుసుతో సంకెళ్లేశాడు. దీనిపై సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు సివిల్ డ్రెస్ లో మదరసాకు వెళ్లి బాధిత పిల్లలతో మాట్లాడగా సిరాజ్, మౌలానా కలిసి పాల్పడ్డ భాగోతం వెలుగు చూసింది. వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సిరాజ్, మదరసా మౌలానాలను అదుపులోకి తీసుకుని జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు పెట్టారు.

More Telugu News