: దూసుకెళ్లిన ఉత్పత్తి రంగం... నాలుగు నెలల గరిష్ఠానికి జూలై పీఎంఐ

గడచిన జూలై నెలలో భారత ఉత్పత్తి రంగం దూసుకెళ్లింది. అన్ని రకాల మాన్యుఫాక్చరింగ్ కంపెనీల్లో నమోదైన వృద్ధి పీఎంఐ (పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్) గణాంకాలను నాలుగు నెలల గరిష్ఠానికి చేర్చింది. ఈ నెలలో పీఎంఐ 51.8 పాయింట్లకు చేరిందని నిక్కీ పీఎంఐ గణాంకాలు వెల్లడించాయి. ద్రవ్యోల్బణం ఒత్తిడి తగ్గడం, రిజర్వ్ బ్యాంకు తదుపరి వారంలో జరిపే పరపతి సమీక్షలో కీలక రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు ఈ రంగం పనితీరును ప్రభావితం చేశాయని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ నెలలో నూతన ఉద్యోగ సృష్టి మాత్రం నామమాత్రంగానే ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. కాగా, ఇండియాలోని 400 ప్రైవేటు కంపెనీల పనితీరు ఆధారంగా ఈ ఇండెక్స్ తయారవుతుందన్న సంగతి తెలిసిందే. ఇండియాలో మార్చి నుంచి కొత్త వ్యాపార సంస్థల విస్తరణ శరవేగంగా నమోదవుతోందని, దేశవాళీ డిమాండు పెరగడంతో పాటు, విదేశీ ఆర్డర్ల సంఖ్యా పెరిగిందని పీఎంఐ వెల్లడించింది. కన్స్యూమర్ గూడ్స్ రంగంలోని సంస్థల ఆర్డర్ బుక్ పెరిగిందని ఆరు నెలల గరిష్ఠానికి ఎగుమతులు చేరాయని పేర్కొంది. 18 నెలల పాటు తగ్గుతూ వచ్చిన ఎగుమతులు జూన్ లో 1.27 శాతం పెరుగుదలను నమోదు చేశాయని తెలియజేసింది. జూలై ఎగుమతి గణాంకాలు విడుదల కావాల్సివుంది.

More Telugu News