: ఎన్ఐఏ చార్జిషీట్‌లో 14 మంది ప్రముఖ ఇస్లాం మత బోధకుల పేర్లు

వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్‌పై దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తాజా చార్జిషీట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 14 మంది ఇస్లాం మత బోధకుల పేర్లను చేర్చింది. వీరి బోధనల ప్రభావం యువతపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పడుతోందన్న ఆరోపణలపై వారి పేర్లను చార్జిషీట్‌కు ఎక్కించింది. అయితే వారిని నిందితులుగా గానీ, అనుమానితులుగా కానీ పేర్కొనలేదు. ఎన్ఐఏ చార్జిషీట్‌లో పేర్కొన్న మత బోధకుల్లో దేశవిదేశాలకు చెందిన ప్రముఖ మతబోధకులు ఉన్నారు. వీరిలో బ్రిటన్‌కు చెందిన అంజీం చౌదరి, హమ్జా ఆండ్రీస్, ఇమ్రాన్ మన్సూర్, మిజనూర్ రహ్మాన్, అబు వాలీద్, అమెరికాకు చెందిన యాసిర్ ఖాధీ, యూసుఫ్ ఎస్టెస్, హమ్జా యూసుఫ్, అహ్మద్ ముసా జిబ్రిల్, అస్ట్రేలియాకు చెందిన ముసా డెరనంటోనియో, షేక్ ఫీజ్ మొహమ్మద్, ఒమర్ ఇల్ బన్న, జింబాబ్వేకు చెందిన ముఫ్తీ మెన్క్, కెనడాకు చెందిన మజీద్ మహ్మూద్ ఉన్నారు. వీరి ప్రసంగాల ప్రభావంతోనే తాము ఉగ్రవాదం వైపు అడుగులు వేసినట్టు ఎన్ఐఏ అరెస్ట్ చేసిన ఐఎస్ అనుమానితులు చెప్పడంతోనే మతబోధకుల పేర్లను ఎన్ఐఏ చార్జిషీట్‌లో చేర్చింది. అయితే వీరిలో ఎవరినీ కూడా అనుమానితులుగా కానీ, నిందితులుగా కానీ పేర్కొనలేదు. చార్జిషీట్‌కు ఎక్కిన మతబోధకుల్లో చాలామంది ఉగ్రవాద సంస్థలైన ఐఎస్, అల్‌ఖైదా చర్యలను ఇప్పటికే బహిరంగంగా ఖండిస్తూ వచ్చారు. కొందరు మాత్రం జిహాదీలకు అనుకూలంగా మాట్లాడారు.

More Telugu News