: తనిఖీలకు వెళ్లిన మహిళా అధికారిని 'పళ్లు రాలగొడతా'నన్న కర్ణాటక ఎమ్మెల్యే!

"నీకసలు సిగ్గుందా? నీ పళ్లు రాలగొడతా"... ఇవి కర్ణాటక ఎమ్మెల్యే సతీష్ రెడ్డి ఐఎఫ్ఎస్ అధికారిణి దీపికా బాజ్ పేయితో అన్న మాటలు. ఈ ఘటన భారీ వర్షాల కారణంగా నాలుగడుగుల మేరకు నీరు చేరిన బొమ్మనహళ్ళి ప్రాంతంలో బీబీఎంపీ (బృహత్ బెంగళూరు మహానగర పాలిక) అధికారి మంజునాథ్ ప్రసాద్ తో కలసి తనిఖీలకు దీపిక వెళ్లిన వేళ జరిగింది. మురుగు నీరు పారే కాలువలు, కల్వర్టుల ఆక్రమణల కారణంగానే నీరు బయటకు వెళ్లే మార్గం లేక వరదలు సంభవించాయని ఆమె వ్యాఖ్యానించగా, ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారని తెలుస్తోంది. అసలు వరద ఎందుకు ముంచెత్తిందన్న విషయమై ఆమెకు కనీస అవగాహన కూడా లేకపోయిందని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతకుముందు సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు ఆమె రావాలని ఎమ్మెల్యే కోరగా, ఆలస్యంగా వచ్చిందని, ఆపై ఆమెను చూడగానే ఎమ్మెల్యే అంతెత్తున లేచాడని తెలుస్తోంది. బెంగళూరు నగరంలో వేళ్లూనుకున్న రియల్ ఎస్టేట్ ముఠాల కారణంగా చెరువులు అన్యాక్రాంతం అయ్యాయని, వాటిని కాపాడాలని తాము ప్రయత్నిస్తుంటే, రాజకీయ నేతలే ఆక్రమణలను ప్రోత్సహిస్తున్నారని ఆమె ఆరోపించించగా, ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేసినట్టు 'ఇండియా టుడే' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

More Telugu News