: 'హోదా... హోదా' అంటూ రాజకీయాలు వద్దు, మా చేతుల్లో ఏమీ లేదు: జైట్లీ మాటలతో కాంగ్రెస్ వాకౌట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదా ఇవ్వాలని కాంగ్రెస్ గట్టిగా నిర్ణయించి వుంటే, ఆనాడే చట్టంలో పొందుపరిచి వుండేదని చెప్పిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, తాము హోదా ఇచ్చే పరిస్థితుల్లో లేమని తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదాపై తన సమాధానం అనంతరం, పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, "హోదా హోదా అంటూ కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. చట్టానికి అనుగుణంగా మాత్రమే మేము నడుచుకోగలం. అంతకుమించి చేయడానికి ఏమీ లేదు. ఏపీ అభివృద్ధికి సహకరిస్తాం. హోదాపై ప్రభుత్వం చేతుల్లో ఏమీ లేదు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల వెంటే వెళతామని మరోసారి చెబుతున్నా" అన్నారు. జైట్లీ ఆన్సర్ మరింత గందరగోళానికి దారి తీసేలా ఉందని సీతారాం ఏచూరి, ఈ సమాధానాన్ని అంగీకరించడం లేదని కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. జైట్లీ వ్యాఖ్యలను తప్పుబట్టిన దిగ్విజయ్ సింగ్, హోదా ఇవ్వకుంటే, ప్రజల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ, జైట్లీ సమాధానాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి సభ నుంచి వాకౌట్ చేశారు.

More Telugu News