: 'ఆడ్ ఈవెన్ డాట్ కాం'తో పాప్యులర్ అయిన 15 ఏళ్ల బాలుడి మదిలోకి వచ్చిన మరో వినూత్న ఆలోచన ఇది!

అక్షత్ పటేల్... ఈ పేరు గుర్తుందా? ఢిల్లీలో సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టిన వేళ, తన సరికొత్త ఆలోచనతో కార్ పూలింగ్ ను 'ఆడ్ ఈవెన్ డాట్ కాం'ను పరిచయం చేసి దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న 15 ఏళ్ల బాలుడు. ఆ వెబ్ సైట్ కు విపరీతమైన క్రేజ్ రాగా, దాన్ని భారీ మొత్తానికి గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న 'ఓరాహీ'కి విక్రయించి అదే సంస్థ సలహా సంఘంలో టెక్నీషియన్, డొమైన్ ఎక్స్ పర్ట్ గా పనిచేస్తున్నాడు. చదువుకుంటున్న దశలోనే నెలకు ఆరంకెల వేతనాన్ని పొందుతున్నాడు. ఇప్పుడా అక్షత్ పటేల్ మనసులో మరో వినూత్న ఆలోచన వచ్చింది. అదే 'చేంజ్ మై ఇండియా డాట్ ఆర్గ్'. భారత పౌరులు నిత్యమూ తాము ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించుకుని వాటి పరిష్కారానికి సాంకేతిక, సాంకేతికేతర మార్గాలను కనుగొనే ప్రయత్నం చేసేందుకు ఇది ఉపకరిస్తుంది. "చేంజ్ మేకర్ అవార్డుకు ఎంపికైన నాటి నుంచే, నాలో ఇంకేదో చేయాలన్న ఆలోచన మొదలైంది. ఇండియాలో సామాజిక మార్పు కోసం మరింత పెద్ద ప్లాట్ ఫాంను ఏ రూపంలో తీసుకురావాలన్న విషయమై ఎన్నో రోజులు ఆలోచించాను. తాము ఎదుర్కునే అన్ని రకాల సమస్యలనూ రోజువారీ విధానంలో చర్చించుకునేందుకు ఏ విధమైన సదుపాయాలూ లేవని తెలుసుకుని చేంజ్ మై ఇండియాను తీసుకుని వచ్చా" అని అక్షత్ వివరించాడు. మార్పును కోరుకునే ప్రతి ఒక్కరికీ ఇది వేదికగా నిలుస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు. దేశవ్యాప్తంగా 10 లక్షల మందిని చేంజ్ మేకర్స్ బోర్డుపై చేర్చుకోవాలన్నదే తన తొలి లక్ష్యమని చెబుతున్నాడు. ఆల్ ది బెస్ట్ అక్షత్!

More Telugu News