: ఏపీకి న్యాయం చేస్తామని కాంగ్రెస్, బీజేపీ రెండూ హామీ ఇచ్చాయి... ఏం చేశారు?: రాజ్యసభలో సీతారాం ఏచూరి

సిద్ధాంతపరంగా విభజనను తాము వ్యతిరేకించామని సీపీఎం నేత సీతారాం ఏచూరి తెలిపారు. రాజ్యసభలో ఆయన తెలుగులో మాట్లాడుతూ, రెండు రాష్ట్రాలకు న్యాయం చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారని అన్నారు. విద్యుత్, నీరు, నిధుల పంపకాలు ఎలా చేస్తారు? అని తాను ఆ రోజే అడిగానని గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఐదేళ్లు ఇస్తామని కాంగ్రెస్ అంటే...వెంకయ్యనాయుడు పదేళ్లు కావాలని అన్నారు. రెండు బడ్జెట్లు గడిచిపోయాయి. ఏపీకి న్యాయం చేస్తామని కాంగ్రెస్, బీజేపీ రెండూ హామీ ఇచ్చాయి. ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఏమీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. మీరు ఏమీ చేయకపోతే... ఆ రెండు రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాలు పుట్టుకొస్తాయి... వాటి పరిస్థితి దిగజారుతోంది. దాని వల్ల దేశ సమైక్యతకు నష్టం వాటిల్లుతుంది. ఆ రెండు రాష్ట్రాలకు ఏం చేయాలని నిర్ణయించారో వాటిని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఏ హామీలు ప్రధాని ఇచ్చారో వాటిని అమలు చేయాలని ఆయన సూచించారు. పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి, పోతుంటాయని, కానీ ప్రధాని మాటకు విలువ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. 'ఏపీ ప్రత్యేకహోదా బిల్లును బడ్జెట్ బిల్లు అంటున్నారు... అందువల్ల జాకీర్ హుస్సేన్ చెప్పినట్టు దీనిపై చర్చ జరపాలి. దానిపై అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాలి' అని ఆయన సూచించారు.

More Telugu News