: తెలుగు నాట ఐఏఎస్ బాధ్యతల్లోకి మరో ఐపీఎస్?... సివిల్ సప్లైస్ కమిషనర్ గా కీలక పోస్టింగ్!
దేశవ్యాప్తంగా పాలనలో ఐఏఎస్ అధికారులదే కీలక భూమిక. ప్రభుత్వాల నిర్ణయాలు, పథకాలు అన్నీ అమలు అయ్యేది వారి ద్వారానే. అయితే, తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోకముందే ఐపీఎస్ అధికారిగా మంచి పేరున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్... ఐఏఎస్ అధికారులు నిర్వర్తించే గురుకుల పాఠశాలల కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ కేడర్ కు వచ్చిన ఆయనను కేసీఆర్ సర్కారు అదే పోస్టులో కొనసాగిస్తోంది. పూర్వాశ్రమంలో గురుకుల పాఠశాలల్లోనే విద్యార్థి జీవితం గడిపిన ప్రవీణ్ కుమార్... గురుకుల పాఠశాలల వ్యవస్థలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో తెలంగాణలోనే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలోనూ సత్తా కలిగిన ఐపీఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న మరో సీనియర్ పోలీసు అధికారి ఐఏఎస్ అధికారులకు దక్కే సివిల్ సప్లైస్ (పౌర సరఫరాల శాఖ) కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాదు పోలీసు శాఖలో పలు కీలక పదవుల్లో పనిచేసిన సదరు అధికారికి ఈ కీలక బాధ్యతలు అప్పగించేందుకు కేసీఆర్ సర్కారు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విధి నిర్వహణలో అలసత్వం, అవినీతికి ఆమడ దూరంలో ఉంటారని భావిస్తున్న సదరు అధికారికి... పౌర సరఫరాల్లో కొనసాగుతున్న అవినీతి దందాను అరికట్టే బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ప్రజా పంపణీ వ్యవస్థలో కీలకమైన సివిల్ సప్లైస్ కమిషనర్ పదవిలో సదరు అధికారి... ఆ శాఖలోని మకిలిని కడిగిపారేస్తారన్న భావనతోనే ప్రభుత్వం ఈ దిశగా యోచించేందుకు కారణంగా నిలిచినట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడనుందని వార్తలు వినిపిస్తున్నాయి.