: తొలి రోజు టీమిండియాదే...మాకూ ఓ రోజుంది: విండీస్ స్పిన్నర్ దేవేంద్ర భిషు

వెస్టిండీస్ సిరీస్ లో భారత జట్టు ఆకట్టుకుంది. తొలి రోజు ఆటలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు శిఖర్ ధావన్ (84), విరాట్ కోహ్లీ (143) అద్భుతంగా ఆడారు. టీ20 ఫార్మాట్ నుంచి వీరిద్దరూ టెస్టు ఫార్మాట్ కు తగ్గట్టుగా మారిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. అయితే మ్యాచ్ తొలిరోజు ఆట ముగిసిన అనంతరం విండీస్ స్పిన్నర్ దేవేంద్ర భిషు మాట్లాడుతూ, తొలిరోజు టీమిండియాదని అన్నాడు. తమకు కూడా ఒకరోజు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీకి బౌలింగ్ చేయడం సవాల్ కాదని అన్నాడు. 'అందరు ఆటగాళ్లలాగే కోహ్లీ కూడా' అని చెప్పిన బిషు, టెస్టు అన్నాక ఓపిక అవసరమని పేర్కొన్నాడు. ఓపిక నశిస్తే మాత్రం బౌలర్లకు చెడ్డరోజు అవుతుందని పేర్కొన్న బిషు, ఇది బ్యాటింగ్ పిచ్ అని అన్నాడు. పిచ్ పై బంతి టర్న్ అవ్వలేదని, మూడోరోజు నుంచి స్పిన్నర్లకు పిచ్ అనుకూలిస్తుందని చెప్పాడు. తమ బౌలర్లలో గాబ్రియెల్ టీమిండియా టాపార్డర్ ను ఇబ్బంది పెట్టాడని చెప్పాడు. కాగా వెస్టిండీస్ బౌలర్లంతా విఫలమైన వేళ బిషు ఒక్కడే మూడు వికెట్లు తీయడం విశేషం.

More Telugu News