: కాశ్మీరీల ఆందోళనలతో వెనుదిరిగిన సల్మాన్ సినిమా యూనిట్

'సుల్తాన్' సినిమాతో ఘనవిజయం సాధించిన సల్మాన్ ఖాన్ నటించే తదుపరి సినిమా కాశ్మీర్ షెడ్యూల్ కేన్సిల్ అయింది. జమ్మూకాశ్మీర్ లో శాంతి భద్రతల సమస్య తలెత్తడంతో షూటింగ్ షెడ్యూల్ ను రద్దు చేసుకుని యూనిట్ వెనుదిరిగారు. 'ఏక్ థా టైగర్', 'భజరంగీ భాయ్ జాన్' సినిమాలతో బాక్సాఫీసును కొల్లగొట్టిన సల్మాన్ ఖాన్, కబీర్ ఖాన్ లు మరోసారి 'ట్యూబ్ లైట్' అనే సినిమా కోసం జతకట్టారు. కబీర్ ఖాన్ పై నమ్మకంతో ఆయన దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి నటించేందుకు సల్మాన్ సై అన్నాడు. దీంతో వీరిద్దరూ ఈ నెల 25 నుంచి కాశ్మీర్ లోని లడఖ్ లో తొలి షెడ్యూల్ చిత్రీకరించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఈ మేరకు యూనిట్ ఇప్పటికే కాశ్మీర్ చేరుకున్నారు. అయితే అక్కడ శాంతిభద్రతలు క్షీణించడంతో షెడ్యూల్ ను రద్దు చేసుకుని ముంబై తిరిగివచ్చేశారు. ఈ షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే తెలియజేస్తానని కబీర్ ఖాన్ తెలిపాడు.

More Telugu News