: రిలయన్స్ జియో దెబ్బకు డేటా రేట్లు భారీగా తగ్గించనున్న ఎయిర్ టెల్!

దేశవ్యాప్తంగా 4జీ తరంగాలను కలిగివున్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, శరవేగంగా దూసుకొస్తుంటే, నష్ట నివారణకు ఐడియా సెల్యులార్ నడిచిన మార్గంలోనే భారతీ ఎయిర్ టెల్ కూడా పయనిస్తోంది. ప్రీ పెయిడ్ కస్టమర్లకు 67 శాతం మరింత ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించింది. డేటా రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. "తాము ఆఫర్ చేసే సరికొత్త డేటా ప్యాక్ లు మొబైల్ ఇంటర్నెట్ వాడకాన్ని దేశవ్యాప్తంగా మరింతగా పెంచుతాయని భావిస్తున్నాం" అని భారతీ ఎయిర్ టెల్ ఆపరేషన్స్ డైరెక్టర్ అజయ్ పూరి వ్యాఖ్యానించారు. రూ. 455కు ఇంతవరకూ 4జీ లేదా 3జీపై 2 గిగాబైట్ల డేటాను ఇస్తున్న ఐడియా, ఇకపై 3 గిగాబైట్లను అందిస్తుంది. అదే రూ. 655 రీచార్జ్ పై ఇప్పుడున్న 3 జీబీని 5 జీబీకి, రూ. 989 రీచార్జ్ పై ఇప్పుడున్న 6.5 జీబీని 10 జీబీకి పెంచుతూ నిర్ణయించింది. రూ. 25 రూపాయల 2జీ ప్యాక్ పై ప్రస్తుతం 100 ఎంబీ ఇస్తుండగా, దాన్ని 145 ఎంబీకి, రూ. 145 కు ఇప్పుడిస్తున్న 440 ఎంబీని 580 ఎంబీకి పెంచుతున్నట్టు పేర్కొంది. ఎయిర్ టెల్ సైతం తమ కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను సిద్ధం చేస్తున్నట్టు అజయ్ తెలిపారు. కాగా, డేటా చార్జీల తగ్గింపుపై స్పందించేందుకు వోడాఫోన్ భారత ప్రతినిధి మాత్రం నిరాకరించారు.

More Telugu News