: భారీగా లాభపడ్డ హెచ్డీఎఫ్సీ... టాప్-8 కంపెనీల లాభం రూ. 58 వేల కోట్లు

గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 709 పాయింట్లు పెరిగి 2.61 శాతం లాభాలను అందుకున్న వేళ, మార్కెట్ కాపిటలైజేషన్ పరంగా టాప్-10 కంపెనీల్లోని ఎనిమిది లాభాల్లో నిలిచాయి. ఈ కంపెనీల విలువ రూ. 57,965.56 కోట్లకు పైగా పెరిగి, మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ ను సూచించింది. ఈ ఎలైట్ గ్రూప్ లోని కంపెనీల్లో ఇన్ఫోసిస్, సన్ ఫార్మా మినహా మిగతా కంపెనీలన్నీ లాభాల్లో నిలిచాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అన్నింటికంటే అత్యధికంగా రూ. 13,030 కోట్ల మేరకు మార్కెట్ కాప్ ను పెంచుకుని రూ. 3.10 లక్షల కోట్లకు పెరిగింది. ఇక హెచ్డీఎఫ్సీ మార్కెట్ వాల్యూ రూ. 12,237 కోట్లు పెరిగి రూ. 2.15 కోట్లకు చేరుకోగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 10,521 కోట్లు లాభపడి, రూ. 3.28 లక్షల కోట్లకు చేరింది. ఒఎన్జీసీ రూ. 5,860 కోట్లు, కోల్ ఇండియా రూ. 5,053 కోట్లు, హెచ్యూఎల్ రూ. 4,198 కోట్లు, ఐటీసీ రూ. 3,832 కోట్లు, టీసీఎస్ రూ. 3,231 కోట్లు లాభపడ్డాయి. ఇదే సమయంలో ఇన్ఫోసిస్ మార్కెట్ కాప్ రూ. 19,868 కోట్లు, సన్ ఫార్మా రూ. 1,961 కోట్లు నష్టపోయాయి. ఇక ఇండియాలోనే అత్యధిక విలువను కలిగివున్న కంపెనీగా టీసీఎస్ నిలువగా, ఆపై రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, హెచ్యూఎల్, కోల్ ఇండియా, ఒఎన్జీసీ, సన్ ఫార్మాలు టాప్-10లో నిలిచాయి.

More Telugu News