: బెబ్బులిలా చెలరేగిన విజేందర్... దగ్గరుండి చూసిన రాహుల్ గాంధీ!

సొంతగడ్డపై బాక్సింగ్ స్టార్ విజేందర్ సింగ్ బెబ్బులిలా చెలరేగాడు. గత రాత్రి న్యూఢిల్లీలో జరిగిన డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ క్యాటగిరీలో డబ్ల్యూబీసీ యూరోపియన్ చాంపియన్, ఆస్ట్రేలియన్ కెర్రీ హోప్ తో పోటీపడి ఘన విజయం సాధించాడు. ఈ మ్యాచ్ ని తిలకించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, క్రికెటర్లు యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. వారంతా విజేందర్ ను అభినందిస్తుండగా, 10 రౌండ్లు సాగిన పోటీలో తన పదునైన పంచ్ లతో విజేందర్ ప్రత్యర్థిపై ఆధిపత్యం చూపి, 98-92, 98-92, 100-90 పాయింట్ల తేడాతో విజయం సాధించి, తన కెరీర్ లో అత్యుత్తమ టైటిల్ సాధించాడు. ఈ మ్యాచ్ కి మహిళా బాక్సర్ మేరీ కోం, మరో బాక్సర్ యోగేశ్వర్ దత్ తదితరులు కూడా హాజరయ్యారు. విజయం అనంతరం విజేందర్ మాట్లాడుతూ, "ఇది నా దేశపు విజయం. నన్ను ఉత్సాహపరిచేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇప్పుడే కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది" అని అన్నారు.

More Telugu News