: భర్త లేకుండా హనీమూన్ కి వెళ్లి... సోషల్ మీడియాను ఆకట్టుకుంటున్న పాక్ వివాహిత!

పాకిస్థాన్ కు చెందిన వివాహిత భర్త లేకుండా హనీమూన్ కు వెళ్లి సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారింది. వివరాల్లోకి వెళ్తే... పాకిస్థాన్ లోని లాహోర్ కు చెందిన హుమా, అర్సలాన్ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలసి రెండో హనీమూన్ కు గ్రీస్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, గ్రీస్ ఎంబసీ అర్సలాన్ కు వీసా నిరాకరించింది. అదే సమయంలో హుమా, ఆమె అత్తమామలకు వీసా మంజూరు చేసింది. భర్త ప్రోత్సాహంతో అత్తమామలను తోడు తీసుకుని హనీమూన్ కి వెళ్లింది. ఈ సందర్భంగా వారు వెళ్లిన ప్రతి పర్యాటక ప్రాంతంలో భర్త లేని లోటును ఫీలవుతూ ఫోటోలు దిగింది. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి, తను 'భర్తలేని హనీమూన్ ను ఎంత చికాకుగా ఎంజాయ్ చేస్తున్నానో!' అంటూ కామెంట్ పెట్టింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీటికి వచ్చే లైకులు, షేర్ల పుణ్యమా అని హుమా సెలబ్రిటీగా మారింది.

More Telugu News