: నేపాల్‌కు తొలి మహిళా చీఫ్ జస్టిస్.. బాధ్యతలు స్వీకరించనున్న సుశీలా కర్కి

పొరుగుదేశం నేపాల్‌లో మహిళా శకం ప్రారంభమైంది. నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఇప్పటికే విద్యాదేవి బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, పార్లమెంటు లో తొలి మహిళా స్పీకర్‌గా ఒన్సారి ఘర్తి కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ బాటలో మరో ప్రముఖ మహిళ చేరారు. దేశంలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సుశీలా కర్కి నియమితులయ్యారు. ఇప్పటికే తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా ఉన్న ఆమెను పూర్తిస్థాయి బాధ్యతల్లో నియమించాలని పార్లమెంటరీ ప్రత్యేక కమిటీ నిర్ణయించింది. 64 ఏళ్ల కర్కి బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. తనను చీఫ్ జస్టిస్‌గా నియమించిన వార్త తెలుసుకున్న ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జిల లేమితో కొట్టుమిట్టాడుతోందని, ఆ పోస్టులను భర్తీ చేయాలని పార్లమెంటరీ కమిటీని కోరారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఆమెను అత్యున్నత పోస్టులో నియమించాలని భావించినా సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదు. చీఫ్ జస్టిస్ కల్యాణ్ శ్రేష్ట రిటైర్ అవడంతో ఏప్రిల్ 14న ఆమె తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. 1979లో లీగల్ ప్రాక్టీస్ మొదలు పెట్టిన కర్కి.. సుప్రీం చీఫ్ జస్టిస్‌గా జూన్ 6, 2017వరకు కొనసాగుతారు.

More Telugu News