: ‘పనామా’ కుబేరులపై దర్యాప్తు షురూ!... 12 దేశాలకు సీబీడీటీ లేఖలు!

ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నును ఎగవేసి ఆదాయాలను దొడ్డిదారిన విదేశాలకు తరలించిన నల్ల కుబేరులపై కేంద్ర దర్యాప్తు ముమ్మరమైంది. ప్రధానంగా బ్రిటన్ వర్జిన్ ఐల్యాండ్స్ లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారంటూ ‘పనామా పేపర్స్’లో బయటపడ్డ వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ఆర్థిక కార్యకలాపాలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన పనామా పేపర్స్ లో భారత్ లోని వివిధ రంగాల్లో ప్రముఖులుగా ఉన్న వ్యక్తుల పేర్లు బయటపడిన విషయం తెలిసిందే. ఆరోపణలకు సంబంధించి వివరాలను వెల్లడి చేయాలని సీబీడీటీ ఇప్పటికే ఆయా ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించిన కొందరు వివరాలు అందజేయగా, మరికొందరు మాత్రం ససేమిరా అన్నారట. దీంతో రంగంలోకి దిగిన సీబీడీటీ... నోటీసులకు స్పందించని వారి గుట్టు రట్టు చేసేందుకు రంగంలోకి దిగింది. సదరు వ్యక్తుల పెట్టుబడులకు సంబంధించి అందుబాటులో ఉన్న అన్ని వివరాలు తెలియజేయాలని స్విట్జర్లాండ్, బ్రిటన్, బ్రిటన్ వర్జిన్ ఐల్యాండ్స్ తో సహా మొత్తం 12 దేశాలకు సీబీడీటీ లేఖలు రాసింది. ఈ వివరాలు అందగానే, వాటి ఆధారంగా అక్రమార్కుల బెండు తీసేందుకు సీబీడీటీ సన్నాహాలు చేస్తోంది.

More Telugu News