: ఇది... 116 ఏళ్లుగా తిరుగుతున్న అలుపెరగని సైకిల్ కథ!

116 ఏళ్లు!...సుదీర్ఘ కాలం...ఇంత కాలం ద్విచక్రవాహనం అలుపెరగకుండా పని చేసిందంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే పదేళ్లు నిరంతరాయంగా సేవలందించే వాహనాన్ని డొక్కుగా పరిగణిస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ వాహనం ఇంతకాలం సేవలందించడం ఆశ్చర్యమే. వివరాల్లోకి వెళ్తే...116 ఏళ్ల క్రితం అంటే 19వ శతాబ్దంలో ఈ సైకిల్ ను నాటింగ్ హోమ్ లో తయారు చేశారు. అప్పట్లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈఐటీ ప్యారీ కంపెనీ ఉండేది. ఇందులో మద్రాసుకు చెందిన ఇంజినీర్‌ రామమూర్తి పనిచేసేవారు. ఆయన చదువుకునే కాలంలో ఆయన తండ్రి 70 రూపాయలతో ఈ సైకిల్‌ కొనుగోలు చేశారట. మద్రాసు నుంచి వచ్చిన ఆయన ఇక్కడే విధులు నిర్వర్తించి, ఉద్యోగ విరమణ చేశారు. తన వద్ద పనిచేసే ఈదులమూడి జైరావుకు అప్పట్లో ఈ సైకిల్ ని ఆయన కానుకగా ఇచ్చేశారు. ఆయన తన కుమారుడైన పీటర్‌ పాల్‌ కు దీనిని కానుకగా ఇచ్చారు. సాధారణంగా సైకిల్‌ అంటే బెల్లు, బ్రేకులు ఉంటాయి. అలాంటి సైకిళ్లకు ఇది విభిన్నం. అప్పట్లోనే దీనిని గేర్లతో తయారు చేశారు. దీనికి డైనమా హబ్‌ కూడా అమర్చారు. ఈ సైకిల్ మూడు గేర్లతో నడుస్తుంది. గేరు మార్చాలంటే న్యూట్రల్ కు రావాల్సిందే. దీనికున్న మరో ప్రత్యేకత ఏమిటంటే, రెండు చక్రాలకు డైనమా హబ్‌ ఉండటం విశేషం. సహజంగా సైకిల్‌ కు డైనమా ఉంటుంది. అది కూడా కేవలం వెనుకచక్రం వద్ద మాత్రమే ఉంటుంది. సైకిళ్లను తొక్కితేనే ఈ డైనమా పనిచేసి దీపం వెలుగుతుంది. కానీ ఈ సైకిల్ కు మాత్రం తొక్కకపోయినా దీపం వెలగడం విశేషం.

More Telugu News