: విచక్షణారహితంగా విరుచుకుపడిన ఉగ్రవాదులు.. రక్తమోడిన ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు

ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. టర్కీలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్‌లోని అటాటర్క్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 32 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. విమానాశ్రయంలోకి చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులు మొదట గార్డులపై తుపాకులతో విరుచుకుపడ్డారు. అనంతరం ఒకరి తర్వాత ఒకరు తమనుతాము పేల్చేసుకున్నారు. మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. విమానాశ్రయంలో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు సహా 32 మంది మృతి చెందగా 88 మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. దాడి తమ పనేనని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. కాగా ఉగ్రవాదంపై సామూహిక యుద్ధానికి అధ్యక్షుడు రెసెప్ టయ్యిప్ ఎర్డోగన్ పిలుపునిచ్చారు. ఇస్తాంబుల్‌లో ఈ ఏడాది జరిగిన నాలుగో ఉగ్రదాడి ఇది.

More Telugu News