: భారత్ కు ఎన్ఎస్జీ సభ్యత్వం కోసం అమెరికా మరో లేఖ!

అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్ కు సభ్యత్వం కోసం అగ్రరాజ్యం అమెరికా ముమ్మర యత్నాలు ప్రారంభించింది. ఈ గ్రూపులో భారత్ సభ్యత్వానికి మద్దతు పలకాలంటూ సభ్య దేశాలకు ఇప్పటికే ఓ లేఖ రాసిన అమెరికా... తాజాగా మరో లేఖ రాసింది. దక్షిణ కొరాయా రాజధాని సీయోల్ లో రేపు జరగనున్న గ్రూపు కీలక భేటీ నేపథ్యంలో అమెరికా ఈ లేఖ రాయడం గమనార్హం. ‘భారత్ కు ఈ గ్రూపులో సభ్యత్వానికి కొంతకాలం క్రితం నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. ఈ క్రమంలో సభ్య దేశాలు భారత్ సభ్యత్వానికి మద్దతు పలకాల్సి ఉంది’’ అని అమెరికా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జాన్ ఎర్నెస్ట్ నిన్న వ్యాఖ్యానించారు. ఇటీవలి భారత ప్రధాని నరేంద్ర పర్యటన సందర్భంగా భారత్ కు మద్దతిస్తామని తమ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా హామీ ఇచ్చారని, ఆ మేరకే తాము సభ్య దేశాలకు లేఖ రాశామని ఆయన పేర్కొన్నారు. అయితే బృందంలో అందరి ఏకాభిప్రాయంతోనే భారత్ కు సభ్యత్వం లభించాల్సి ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

More Telugu News