: బయటకు రావద్దు...వస్తే కిడ్నాపే!: కాబూల్ లో పోలీసుల ఆదేశాలు

భారత్‌ కు చెందిన ఒక పనిమనిషి కిడ్నాప్ అనంతరం ఆఫ్ఘానిస్థాన్...విదేశీయుల రక్షణ కోసం కఠిన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వం దేశంలో నివాసం ఉంటున్న విదేశీయులకు హెచ్చరికలు జారీ చేసింది. కాబూల్ పోలీస్ నేర విచారణ విభాగం చీఫ్ ఫ్రాయిదున్ ఒబైదీ చేసిన వ్యాఖ్యల ప్రకారం... ఆఫ్ఘాన్‌ లోని విదేశీయులు, విదేశీయుల కార్యాలయాలపై టెర్రరిస్టులు కన్నేశారు. దీంతో విదేశీయులకు కిడ్నాప్ ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీయులు సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా బయటకు వెళ్లవద్దు. తప్పని సరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే...భద్రతా బలగాలు, పోలీసుల సహాయం తీసుకోవాలి. లేని పక్షంలో విదేశీయులు ఇంట్లోనే ఉండాలని స్పష్టం చేశారు. అలా కాదని ఒంటరిగా బయటకు వెళ్తే...కిడ్నాప్‌ కు గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని వారు తెలిపారు. అయితే, ఈ ప్రకటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఇలాంటి ప్రకటనలు చేస్తే, ఇక ప్రజలను రక్షించేది ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రకటనలతో తమను నిత్యం ఇబ్బందులపాలు చేస్తున్నారని, సెక్యూరిటీ, భద్రత అంటూ ఎక్కడికి వెళ్లినా ఆపి గంటలకు గంటలు పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నారని శ్రీలంకకు చెందిన నయేలా విక్రమసూరియ మండిపడ్డారు.

More Telugu News