: అనారోగ్యంతో ఉన్న సైంటిస్టులను కాపాడేందుకు అత్యంత క్లిష్టతరమైన మిషన్ చేపట్టి, సౌత్ పోల్ కు పయనం!

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు శాస్త్రవేత్తల ప్రాణాలను కాపాడేందుకు దక్షిణ ధ్రువానికి అత్యంత ప్రమాదకరమైన మిషన్ చేపట్టి బయలుదేరాయి రెండు చిన్న విమానాలు. అంటార్కిటికాలో శీతాకాలం నడుస్తుండగా, గతంలో ఇలాంటి రిస్కీ ఆపరేషన్ ఎప్పుడూ జరగలేదని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ లో ధ్రువాల కార్యకలాపాల డైరెక్టర్ కెల్లీ ఫాల్కనర్ తెలిపారు. కొన్ని కారణాల వల్ల శాస్త్రవేత్తలకు కలిగిన అనారోగ్యం గురించి వెల్లడించలేమని ఆమె తెలిపారు. చాలా క్లిష్టపరిస్థితుల్లో ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుని తెగించి వారి ప్రాణాల కోసం కదిలామని వివరించారు. కాగా, ప్రతియేటా సౌత్ పోల్ కు వింటర్ కు ముందే చేరుకునే 50 మంది బృందం దాదాపు ఆరు నెలల పాటు అక్కడే ఉంటుంది. వారు బయటకు వచ్చే వీలుండదు. కేవలం రేడియో కాంట్రాక్టు ద్వారానే యూఎస్, రష్యాలోని కమాండింగ్ సెంటర్లకు సమాచారం పంపుతుంటారు. వీరందరినీ నేషనల్ సైన్స్ ఫౌండేషన్, లాక్ హీడ్ మార్టిన్ లు కలసి ఎంపిక చేస్తాయి. 60 సంవత్సరాల సౌత్ పోల్ రీసెర్చ్ సెంటర్ చరిత్రలో ఈ తరహా రెస్క్యూ ఆపరేషన్లు రెండుసార్లు మాత్రమే జరిగాయి. అత్యంత శీతల వాతావరణం, మంచు గాలులు విమానాల టేకాఫ్, ల్యాండింగ్ లకు ఎంతమాత్రమూ అనుకూలం కాదు. 1999లో ఓ మహిళా డాక్టర్ తన కుడివైపు ఛాతీలో క్యాన్సర్ సంబంధిత గడ్డను గుర్తించి, స్వయంగా దానిని తొలగించుకోవడమే కాకుండా, ఆపై బయాప్సీ, కీమోథెరపీలను తనే చేసుకున్నారు. ఆమెను బయటకు తెచ్చేందుకు శీతాకాలం ముగుస్తున్న వేళ అక్కడికి బృందం వెళ్లింది. ఆపై పదేళ్ల తరువాత అక్కడి స్టేషన్ మేనేజర్ కు గుండెపోటు వస్తే కూడా ఇలాంటి సమస్యే ఉత్పన్నమైంది. అలాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి విమానంలో తరలించడం క్షేమకరమా? కాదా? అన్న విషయం కూడా వారికి పెద్ద టెన్షన్ అయింది. అది ఒక క్లిష్టతరమైన ప్రదేశం కావడంతో అక్కడి నుంచి తరలించడం చాలా కష్టతరమని గతంలో అక్కడ పనిచేసిన రాన్ షేమాన్స్కీ అనే డాక్టర్ వ్యాఖ్యానించాడు. విశేషం ఏమిటంటే, దక్షిణ ధ్రువం క్యాంప్ నుంచి 2001లో శీతాకాలం సమయంలో తొలిసారిగా అక్కడి నుంచి అత్యవసరంగా తరలించినది ఈయననే!

More Telugu News