: రూ. 3 కోట్లకు పైగా వేతనాన్ని ఇస్తున్న హాటెస్ట్ టెక్ జాబ్!

సీఎక్స్ఓ (చీఫ్ ఎక్స్ పీరియన్స్ ఆఫీసర్) ఇదే ఇప్పుడు ఐటీ, ఎంఎన్సీ, మార్కెటింగ్, టెక్నాలజీ కంపెనీల్లో హాటెస్ట్ జాబ్. సీఈఓలు, సీఎఫ్ఓలు, సీఎంఓ వంటి ఉన్నత పోస్టులు ఎన్నివున్నా సీఎక్స్ఓలకు డిమాండ్ పెరుగుతోంది. గత ఏడాది కాలంలో దాదాపు 20 సీఎక్స్ఓ పోస్టులు భర్తీ అయ్యాయి. డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్, మార్కెటింగ్, ఇన్నోవేషన్ పై కన్నేసిన కంపెనీలు, కేవలం ఒక్క విభాగంలో కాకుండా, సాధ్యమైనన్ని ఎక్కువ విభాగాల్లో అనుభవమున్న వారికి ప్రాధాన్యత ఇస్తూ, వారినీ ఈ పోస్టుకు తీసుకుంటున్నాయి. ఇక వీరికి వేతనంగా సాలీనా రూ. 3.5 కోట్ల వరకూ లభిస్తోందని రీసెర్చ్ సంస్థ గార్ట్ నర్ వైస్ ప్రెసిడెంట్ గణేష్ రామ్మూర్తి తెలిపారు. సీఈఓల స్థానంలో సీఎక్స్ఓలతో పాటు సీడీఓ (చీఫ్ డెవలప్ మెంట్ ఆఫీసర్లు)లకు డిమాండ్ పెరుగుతోందని, వీరికి కూడా సీఈఓలు, సీఎఫ్ఓలతో సమానంగా వేతనం, హోదా లభిస్తోందని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటివరకూ ఇండియాలోని 20 శాతం కంపెనీలు సీడీఓల పేరిట ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్నాయని, మిగతా కంపెనీలూ అదే దారిలో నడుస్తున్నాయని గార్ట్ నర్ విడుదల చేసిన సీఐఓ సర్వే-2016 వెల్లడించింది. కాగా, రిలయన్స్ సహా, ఆదిత్య బిర్లా గ్రూప్, మహీంద్రా, ఆర్పీజీ, రేమాండ్, బిర్లా సన్ లైఫ్, ఎల్అండ్ డీ తదితర కంపెనీలు కొత్తగా సీడీఓ, సీఎక్స్ఓలను నియమించుకున్నాయి. కాన్వోనిక్స్ మాజీ సీఈఓ విశాల్ సంపత్ రిలయన్స్ జియోకు, హెచ్ఎస్బీసీ కమర్షియల్ బ్యాంకింగ్ హెడ్ రాజీవ్ రాయ్ 'ఎడిల్ వైజస్ ఫైనాన్షియల్'కు, టీసీఎస్ డిజిటల్ విభాగం అధిపతి రితీష్ అరోరా 'సియట్' టైర్లకు చీఫ్ డెవలప్ మెంట్ ఆఫీసర్లుగా చేరారు. వీరితో పాటు ఇంకా ఎంతో మంది అన్ని విభాగాల్లో నైపుణ్యంతో తమ సత్తాను చాటేందుకు కొత్త సవాళ్లను స్వీకరిస్తున్నారని గార్ట్ నర్ పేర్కొంది.

More Telugu News