: భారత్ కు అనుకూలంగా మారొద్దు: ఆఫ్ఘనిస్థాన్ కు ముషారఫ్ సూచన

భారత్ స్వార్థంతో చేసే పనుల ఆకర్షణకు లోనై ఆఫ్ఘనిస్థాన్ తమ దేశానికి శత్రువుగా మారవద్దని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ సూచించారు. పాకిస్థాన్-అప్ఘనిస్థాన్ సరిహద్దులోని తోర్కామ్ ప్రాంతంలో ఘర్షణలు చోటుచేసుకొని ఓ పాకిస్థాన్ సీనియర్ ఆర్మీ అధికారి హతమవ్వడంతో ఇస్లామాబాద్ లో ఆయన మాట్లాడుతూ, భారత్ చెప్పినట్లల్లా అప్ఘనిస్థాన్ ఆడుతోందని ఆరోపించారు. అప్ఘనిస్థాన్ కు, భారత్ కు చాలా తేడా ఉందని; పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సారూప్యతలు చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. భారతదేశం తమ మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తోందని తన అక్కసు వెళ్లగక్కారు. విలువలు, జాతి, భాష, మతం వంటి విషయాల్లో తమ రెండు దేశాలకు దగ్గర సంబంధాలు ఉన్నాయని ఆయన సూచించారు. భారత్ చెప్పినట్లు చేస్తూ ఆ దేశం తప్పు చేస్తోందని ఆయన ఆరోపించారు. కాగా, ముషారఫ్ వ్యాఖ్యలు అక్కసుతో కూడినవని, భారత్-అప్ఘనిస్థాన్ సంబంధాలు చూడలేక ఆవేదనతో చేసిన వ్యాఖ్యలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News