: పాతాళానికి జారి, కాస్తంత తేరుకున్న సెన్సెక్స్, నిఫ్టీ

యూరోజోన్ విడిపోతుందన్న భయాల నుంచి యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న ఇన్వెస్టర్ల ఆందోళన మధ్య సెషన్ ఆరంభం నుంచి అమ్మకాల ఒత్తిడితో మధ్యాహ్నానికి పాతాళానికి జారిపోయిన భారత స్టాక్ మార్కెట్ ఆపై కొంతమేరకు తేరుకుని, రికవరీ నమోదు చేసినప్పటికీ, లాభాల్లోకి మాత్రం రాలేకపోయింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలిస్తే 400 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, ఆపై 200 పాయింట్ల రికవరీ సాధించింది. ఒక దశలో 8,100 పాయింట్ల స్థాయి నుంచి కిందకు జారిపోయిన నిఫ్టీ, ఆపై తిరిగి కొనుగోలు మద్దతును సాధించగలిగింది. గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 200.88 పాయింట్లు పడిపోయి 0.75 శాతం నష్టంతో 26,525.46 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 65.85 పాయింట్లు పడిపోయి 0.80 శాతం నష్టంతో 8,140.75 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.37 శాతం, స్మాల్ కాప్ 0.55 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 12 కంపెనీలు లాభపడ్డాయి. హిందాల్కో, గెయిల్, ఆసియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనీలివర్, ఐచర్ మోటార్స్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఇన్ఫ్రాటెల్, మారుతి సుజుకి, అల్ట్రా సిమెంట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,766 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 963 కంపెనీలు లాభాలను, 1,636 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ 1,00,19,117 లక్షల కోట్లుగా నమోదైంది.

More Telugu News