: 'ఉడ్తా పంజాబ్' కు సరికొత్త షాక్... ఆన్ లైన్లో లీకైన చిత్రం!

'ఉడ్తా పంజాబ్' సినిమా యూనిట్ కు భయంకరమైన షాక్ తగిలింది. వివాదం కారణంగా సినిమా ఎక్కడ ఆగిపోతుందోనని భయపడ్డ టీంకు బాంబే హైకోర్టు ఊరటనివ్వగా, దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దానిని తిరస్కరించిన సుప్రీం, పూర్తి వివరాలతో న్యాయస్థానం తలుపుతట్టమని పిటిషనర్ ను ఆదేశించింది. దీంతో 'ఉడ్తా పంజాబ్' యూనిట్ ఊపిరి పీల్చుకుంది. ఈ నెల 17న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, వారిని షాక్ కు గురిచేస్తూ...ఈ సినిమా ఆన్ లైన్ లో విడుదలైపోయింది. దీంతో ఆన్ లైన్ లో ఉన్న లింకులను తొలగించేందుకు 'ఉడ్తా పంజాబ్' యూనిట్ పెద్ద పోరాటమే చేస్తోంది. అయితే ఈ లీకు ఎలా జరిగిందా? అని యూనిట్ ఆరా తీయగా, విడుదలైన ప్రింట్ పై ఫర్ సెన్సార్ అనే ముద్రతోపాటు, డేట్ స్టాంపు కూడా ఉందని సినిమా యూనిట్ తెలిపింది. దీంతో ఈ సినిమాను ఆన్ లైన్లో లీక్ చేసింది సాక్షాత్తు సీబీఎఫ్‌సీ (సెన్సార్ బోర్డు) కి సంబంధించిన వాళ్లేనని చెబుతున్నారు. తాము సెన్సార్ చేసేందుకు ఇచ్చిన ప్రింటును యథాతథంగా లీక్ చేసేశారని వారు ఆరోపిస్తున్నారు. కాగా, సగం సినిమా లీకైనట్టు తెలుస్తోంది. దీనిపై సినిమా యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం విశేషం.

More Telugu News