: దేశానికి మీ వీర్యం అత్యవసరం... యువతకు చైనా ప్రభుత్వం వేడుకోలు

"దేశ భవిష్యత్ ప్రయోజనాల కోసం, దయచేసి వీర్యాన్ని దానమివ్వండి" చైనాలోని 20 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్కులకు ప్రభుత్వం చేస్తున్న విన్నపమిది. చైనా స్పెర్మ్ బ్యాంకుల్లో నిల్వలు అడుగంటిపోవడంతో నష్ట నివారణ చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ప్రాచీన సంప్రదాయాలు, సంస్కృతిని అభిమానించే చైనీయులు వీర్యాన్ని దానం ఇవ్వడానికి సహజంగా ముందుకు రారు. ఇటీవలి కాలం వరకూ ఒక్క సంతానానికే పరిమితమైన చైనాలో, ఇప్పుడు రెండో సంతానానికి అనుమతి లభించడంతో, వయసు మళ్లినవారు స్పెర్మ్ బ్యాంకులను ఆశ్రయిస్తుండగా, వీర్య కొరత వారిని వెక్కిరిస్తోంది. ఇదిలావుండగా, సామాజిక మాధ్యమాల్లో వీర్య దానం చేయాలంటే 1000 డాలర్లు ఇవ్వాలని లేకుంటే రోజ్ గోల్డ్ ఐ ఫోన్ ను బహుమతిగా ఇవ్వాలని కొందరు యువకులు ప్రకటనలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. చైనాలో యువకుల సంఖ్య తగ్గి వృద్ధులు పెరిగిపోవడంతో, భవిష్యత్ అవసరాల నిమిత్తం ఇప్పటి నుంచే దేశభక్తిని చూపుతూ, పిల్లల్ని కనే పనిలో ఉండాలని, వీర్యాన్ని దానం ఇవ్వాలని స్పెర్మ్ బ్యాంకులు ప్రత్యేక ప్రకటనలు గుప్పిస్తున్న పరిస్థితి నెలకొంది. వీర్యాన్ని దానం చేయడం రక్తదానం చేసినంత గొప్పదని ప్రభుత్వం ప్రచారం మొదలు పెట్టింది.

More Telugu News