: నేటితో ముగించేయడమే ధోనీ అండ్ కో లక్ష్యం!

మరో రెండు గంటల్లో జింబాబ్వేతో జరగనున్న రెండో వన్డే పోటీలో విజయం సాధించి సిరీస్ ను నేటితో కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ధోనీ సేన ప్రణాళికలు రూపొందించింది. సిరీస్ గెలుపు లాంఛనాన్ని నేటితో ముగించి, మూడవ మ్యాచ్ లో రిజర్వులో ఉన్న ఆటగాళ్లతో ప్రయోగం చేయడం ద్వారా, వారికి జింబాబ్వే పిచ్ లపై అనుభవం వచ్చేలా చూడాలన్నది ధోనీ అభిమతంగా తెలుస్తోంది. ఇప్పటికే తొలి మ్యాచ్ ని గెలిచిన ఉత్సాహంతో ఉన్న భారత జట్టును కట్టడి చేయడం ద్వారా సిరీస్ ను సజీవంగా ఉంచాలని జింబాబ్వే భావిస్తున్నప్పటికీ, అదేమంత సులువు కాదని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. గతంలో 2013లో జింబాబ్వేలో పర్యటించిన వేళ 5-0 తేడాతో, 2015లో పర్యటించిన వేళ 3-0 తేడాతో ఆతిథ్య దేశాన్ని వైట్ వాష్ చేసిన భారత క్రికెట్ జట్టు, హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తోంది. యువతతో నిండిన భారత జట్టు తొలి మ్యాచ్ లో మాదిరిగానే మిగతా రెండింటిలో రాణిస్తే, జింబాబ్వేకు వైట్ వాట్ ఖాయమే. కాగా, నేటి పోరు మధ్యాహ్నం 12:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) హరారే మైదానంలో మొదలుకానుంది.

More Telugu News