: సైనికుడి వీరోచిత పోరాటం!... ఒంటిచేత్తో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి, వీరమరణం!

మొన్న పంజాబ్ లోని ఫఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు విసిరిన పంజాను అడ్డుకునే క్రమంలో శరీరంలోకి బుల్లెట్లు దిగినా విశ్రమించని వీరుడు, గరుడ కమెండో శైలేశ్ గౌర్ వీరోచిత పోరు ఇంకా మన కళ్ల ముందే కదలాడుతోంది. నాడు శరీరం నుంచి రక్తం ఏరులై పారుతున్నా, దేశ రక్షణ కోసం తాను చేసిన ప్రమాణానికి కట్టుబడిన శైలేశ్ పోరాట పటిమ చూసి కరుడుగట్టిన ఉగ్రవాదులే బిక్కచచ్చిపోయారు. ప్రాణాలు అరచేతబట్టుకుని పరుగు లంకించుకున్నారు. తాజాగా నిన్న జమ్మూ కాశ్మీర్ లోనూ శైలేశ్ పోరాటాన్ని గుర్తుకు తెస్తూ హవల్దార్ హంగ్ పన్ దాదా... భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. ఉగ్రవాదుల అత్యాధునిక మెషీన్ గన్ల నుంచి దూసుకొచ్చిన బుల్లెట్లు శరీరాన్ని గాయపరచినా దాదా ఏమాత్రం వెన్ను చూపలేదు. తన ప్రాణాల కన్నా మాతృభూమి రక్షణే మిన్నగా భావించిన దాదా... ఒంటి చేత్తో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. దాదా మెషీన్ గన్ నుంచి దూసుకువెళ్లిన బుల్లెట్లు ఇద్దరు ఉగ్రవాదులను అక్కడికక్కడే మట్టుబెట్టేశాయి. దాదా దాడిలో తీవ్ర గాయాలైన మరో ఇద్దరు ఉగ్రవాదులు ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయారు. నలుగురు ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరులో దాదా కూడా ప్రాణాలు కోల్పోయారు. దాదా వీర మరణం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసినా... సైన్యంలో ధైర్య సాహసాలను మరింత ఇనుమడింపజేసింది. ఇక ముష్కర ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించింది. కాశ్మీర్ లోని నౌగామ్ సెక్టార్ పరిధిలోని నియంత్రణ రేఖ వద్ద మొన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

More Telugu News